బీజింగ్: చైనాలోని వుహాన్ నగరంలో వ్యాపించిన కోవిడ్-19 వైరస్ ప్రపంచవ్యాప్తంగా అనేకమందిని పొట్టన పెట్టుకుంది. ఈ మహమ్మారి పుణ్యమా అని వ్యాపార, ఆర్థిక రంగాలు తీవ్ర ప్రభావానికి గురైనాయి. వివిధ దేశాల కంపెనీలు చైనాలో మూత పడ్డాయి. దాదాపు అన్ని విమానయాన సంస్థలు తమ సర్వీసులను నిలిపివేసాయి. పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. రానున్న సీజన్లో మరింత పడిపోయే అవకాశం వుందని నిపుణులు భావిస్తున్నారు. దీంతో చైనా ఆర్థిక రంగం అతలాకుతలమవుతోంది. మరోవైపు శరవేగంగా విస్తరిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చైనా శత విధాలా ప్రయత్నిస్తోంది. అటు చైనాలో పలుకంపెనీలు ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా తమ కంపెనీలోని ఉద్యోగుల కోసం ఒకకంపెనీ జాగ్రత్తలు తీసుకుంటోంది. చాంగ్కింగ్లోని ఒక సంస్థ వైరస్ సోకకుండా ఉండేందుకు విధులకు హాజరువుతున్న ఉద్యోగులపై యాంటి వైరస్ మందులను పిచికారి చేసి మరీ వారిని విధుల్లోకి అనుమతిస్తోంది. ఇందుకు కోసం ఏకంగా రెండు సొరంగాలను ఏర్పాటు చేసింది.